మంత్రాల నెపంతో మామను, అత్తను చంపేశాడు

4 Jul, 2017 18:06 IST|Sakshi

జష్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ లో దారుణం జరిగింది. చేతబడులు చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తి తన సొంత మేనమామ, అత్తలను కొట్టి చంపాడు. జష్‌పూర్‌ జిల్లా కరదరి గ్రామంలో ఈ ఘోరం వెలుగుచూసుంది. గ్రామానికి చెందిన లండ్రూ రాం భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి కారణం.. తన మేనమామ బిషున్‌ రాం(60), అతని భార్య బసంతి రాయ్‌(48)నే అని లండ్రూ అనుమానం. దీంతో వారిద్దరినీ అంతం చేయాలని పథకం పన్నాడు. ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన ఇంటికి వారిద్దరినీ ఆహ్వానించాడు. అయితే, ఆ దంపతులకు అనుమానం వచ్చింది.

కానీ, లండ్రూరాం మాయమాటలు చెప్పి రప్పించాడు. మార్గమధ్యంలోనే వారితో వాదులాటకు దిగి ఇంటి సమీపంలోకి చేరాక ఇద‍్దరినీ కర్రతో తీవ్రంగా కొట్టి చంపాడు. సోమవారం సాయంత్రం ఆ మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లండ్రూను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఆరోగ్య సమస్యలకు వారి మంత్రాలే కారణమనే అనుమానంతో చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతనిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు