ధారావిలో తొలి మరణం.. అధికారులకు ముచ్చమటలు

2 Apr, 2020 09:38 IST|Sakshi

సాక్షి, ముంబై : కరోనా వైరస్‌ ధాటికి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. కరోనా ప్రభావం ఈ రాష్ట్రంపై ఎక్కువగా చూపుతోంది. గురువారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా 1950కిపైగా కరోనా కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే 340 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో ఒకటిగా గుర్తింపు పొందిన మహారాష్ట్రలోని ధారావిలో గురువారం తొలి కరోనా మరణం నమోదైంది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు జాగ్రత్తగా బాధితుడు నివశిస్తున్న భవంలోని అందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (కరోనా: ఆరు వారాల శిశువు మృతి)

మరోవైపు గడిచిన 24 గంటల్లోనే 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో పాటు ఆరుగురు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశంలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిలో వ్యాధి విస్తరిస్తే అదుపుచేయడం కష్టతరమైన వైద్యులు భావిస్తున్నారు. ముంబయి మహానగరం నడిబొడ్డున ఉంది ఈ ధారావి మురికివాడ. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్‌ షాపులు, మురికి కాలువలతో నిండి ఉంటుంది. దాదాపు 16 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. చాలామంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఎగుమతికి అనువైన- నాణ్యమైన తోలు ఉత్పత్తులు, కుండలు, ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేస్తుంటారు. ఇక్కడ జరిగే వ్యాపారం వార్షిక టర్నోవర్ రూ.4,800 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. (కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి)

ధారావిలో చెత్త ఏరుకునేవారు ఎ‍క్కువగా నివశిస్తుంటారు. పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ, పరిశుభ్రత మాత్రం సరిగా ఉండదు. మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది.  దీంతో వైరస్‌ ఈ మురికివాడకు చేరకుండా ముంబై మున్సిపల్‌ అధికారులు తొలినుంచీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం తొలి మరణం నమోదు కావడం అధికారులకు ముచ్చమటలు పడుతున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా ధాటికి 16 మంది మృతిచెందారు.

>
మరిన్ని వార్తలు