యూపీలో వెలుగు చూసిన వింత సంఘటన

20 Aug, 2019 12:55 IST|Sakshi

లక్నో: వరకట్న వేధింపులు.. అత్తింటి వారి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకునే వారి గురించి విన్నాము. అయితే ఈ మధ్య కాలంలో చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే దంపతులు కూడా ఈ కోవలోకే వస్తారు. ‘ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో చోటు చేసుకుంది.

ఆ వివరాలు.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. అతని సూచన మేరకు బాధితుడికి ప్రతి రోజు ఉదయం 4, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఇతర ఏ పదార్థాలు ముట్టుకోనివ్వడం లేదు. దాంతో విసిగిపోయిన బాధితుడు, భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు