17 రోజుల్లోనే జీవిత ఖైదు

19 Dec, 2019 02:47 IST|Sakshi

చిన్నారిపై రేప్‌ కేసులో పోక్సో కోర్టు తీర్పు

జైపూర్‌: చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 17 రోజుల్లోనే తీర్పు ప్రకటించి రాజస్తాన్‌లోని ఒక పోక్సో (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రెన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌) ప్రత్యేక కోర్టు చరిత్ర సృష్టించింది. చురు జిల్లాలో నవంబర్‌ 30వ తేదీన 21 ఏళ్ల దయారాం మేఘ్వాల్‌ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మర్నాడే అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్‌ 7వ తేదీన చార్జిïషీటు దాఖలు చేశారు.

డిసెంబర్‌ 17న దయారాంకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అంటే, 17 రోజుల్లోనే పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ, తీర్పు.. అన్నీ ముగిశాయి. ‘పోలీసులు చురుగ్గా పనిచేశారు. సకాలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. బాధిత బాలిక వాంగ్మూలం కీలక పాత్ర పోషించింది. కోర్టు రోజువారీ విచారణ జరిపింది. దాంతో త్వరితగతిన తీర్పు సాధ్యమైంది’ అని చురు జిల్లా ఎస్పీ తేజస్విని గౌతమ్‌ వివరించారు. దోషి దయారాం తండ్రికి కూడా గతంలో ఒక రేప్‌ కేసులో జైలు శిక్ష విధించారు. 

మరిన్ని వార్తలు