జాతీయగీతం బ్యాన్.. వ్యక్తి అరెస్ట్..!

8 Aug, 2016 11:19 IST|Sakshi
జాతీయగీతం బ్యాన్.. వ్యక్తి అరెస్ట్..!

అలహాబాద్ః స్కూల్లోని విద్యార్థులు, సిబ్బంది జాతీయ గీతం ఆలపించకూడదని నిబంధన విధించిన ఓ స్కూల్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయగీతంలోని పదాలు ఇస్లాం మతాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా ఉన్నాయని అతడు ఆరోపించడమే కాక, ఆ గీతాన్ని పాడకూడదన్న షరతులు విధించడంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  సదరు స్కూల్ మేనేజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలహాబాద్ బఘారా ప్రాంతంలో ఉన్న ఎం ఏ కాన్వెంట్ స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  స్కూల్లో సిబ్బంది, విద్యార్థులు జాతీయగీతం పాడకూడదని, ఇస్లాం మతాన్ని ఉల్లంఘించే పదాలు ఆ గీతంలో ఉన్నాయని హక్ నిబంధన విధించాడు. దీంతో హక్ పై విద్యాధికారులు నగరంలోని  కొలోనెల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు జియా ఉల్ హక్ ఎటువంటి అనుమతి లేకుండా స్థానికంగా పాఠశాల నడిపుతున్నాడని, హక్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కంప్లైంట్ లో తెలిపారు. అంతేకాక ఎంఏ కాన్వెంట్ స్కూల్ కు  ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నుంచి ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా హక్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. విద్యాశాఖ ఫిర్యాదు మేరకు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రవర్తిస్తున్న స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రాజేష్ యాదవ్ తెలిపారు.

స్కూల్ మేనేజర్ పెట్టిన కఠినమైన షరతులకు నిరసనగా ఎంఏ కాన్వెంట్ స్కూల్ నుంచి మొత్తం ఎనిమిదిమంది ఉపాధ్యాయులు సహా ప్రిన్సిపాల్ కూడా రాజీనామా చేశారు. పాఠశాల్లో ఉపాధ్యాయులు చాలామంది ఈమధ్య కాలంలోనే చేరిన వారేనని, గత 12 ఏళ్ళుగా ఇక్కడ జాతీయగీతం పాడేందుకు అనుమతిలేదన్న షరతు విని తామంతా ఆశ్యర్యానికి గురయ్యామని, మేనేజర్ నిబంధనలకు తమ మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతోనే తామంతా రిజైన్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ రీతూ త్రిపాఠీ తెలిపారు. మొత్తం 300 మంది విద్యార్థులతో నడుస్తున్న ఎంఏ కాన్వెంట్ నిర్వహణ వైఖరికి నిరసనగా తనతోపాటు ఏడుగురు సహోపాధ్యాయులు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. అయితే జాతీయ గీతంలోని మొదటి చరణంలో ఉండే 'భారత భాగ్య విధాతా'  పదాలు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని, దీంతో ఆ గీతాన్ని పాడకూడదన్న హక్ నిబంధనతో రెండురోజుల క్రితం తామంతా పాఠశాలనుంచీ రాజీనామా చేసినట్లు తెలిపారు.

అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇన్నాళ్ళుగా ఎంఏ స్కూల్ నడవటంతోపాటు, సిబ్బంది, విద్యార్థులకు  తీవ్రమైన నిబంధనలు విధిస్తున్నస్కూల్ వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయామని, వారంరోజుల క్రితమే స్కూల్ మూసివేయాలంటూ తాము నోటీసులు జారీ చేసినట్లు అలహాబాద్ బేసిక్ శిక్షా అధికారి జై కరణ్ యాదవ్ తెలిపారు. మరోవైపు తమ  పాఠశాల నిబంధనలను పాటించలేని పరిస్థితుల్లోనే సదరు ఉపాధ్యాయులు రిజైన్ చేయాల్సి వచ్చిందని, జాతీయ గీతంలోని మొదటి చరణంలో ఉండే 'భారత భాగ్య విధాతా' అంటే భారత్ విధి నిర్ణయిస్తుందన్న అర్థం వస్తోందని,  అల్లాయే మా విధి విధాత అని, భారత్ విధి నిర్ణయిస్తుందని మేం ఎలా చెప్తాం? అంటూ జియా ఉల్ హక్ ప్రశ్నిస్తున్నాడు. అయితే జనగణమన లోని అధినాయక్ పదంపై ఒక్క ముస్లిం మతస్థులే కాక ఇతరులు అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు