రాజస్ధాన్‌ నుంచి రాజ్యసభ బరిలో మన్మోహన్‌

13 Aug, 2019 14:31 IST|Sakshi

జైపూర్‌ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం జైపూర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. రాజస్ధాన్‌ నుంచి పెద్దల సభకు పోటీపడుతున్న మన్మోహన్‌ సింగ్‌కు విమానాశ్రయంలో రాజస్దాన్‌ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి మారియట్‌ హోటల్‌కు చేరుకున్న మన్హోహన్‌, గెహ్లోత్‌లతో డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌లు కొద్దిసేపు చర్చలు జరిపారు.

అక్కడినుంచి ప్రదర్శనగా రాజస్ధాన్‌ అసెంబ్లీకి చేరుకున్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. మన్మోహన్‌ సింగ్‌ గత మూడు దశాబ్ధాలుగా అసోం నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్ధాన్‌ బీజేపీ చీఫ్‌ మదన్‌ లాల్‌ సైనీ మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానానికి మన్మోహన్‌ సింగ్‌ పోటీపడుతున్నారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండటంతో మన్మోహన్‌ రాజ్యసభకు సునాయాసంగా ఎన్నికవనున్నారు.

>
మరిన్ని వార్తలు