తదుపరి ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌

17 Dec, 2019 00:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవానే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన తర్వాత అత్యంత సీనియర్‌ అయిన ముకుంద్‌ నరవానే ఆర్మీ చీఫ్‌గా నియమితులై 13 లక్షల మంది ఉన్న ఆర్మీని నడపనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఉన్నత స్థాయిలో పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్‌ చీఫ్‌గా పనిచేస్తున్నారు. వైస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల వద్ద పనిచేస్తున్న ఈస్ట్రన్‌ కమాండ్‌ను నడిపించారు.

37 ఏళ్ల తన సర్వీసులో సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌ వంటి చోట్ల పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. మూడేళ్ల పాటు మయన్మార్‌లో ఉండి భారత ఎంబసీతో కలసి పని చేశారు. ఈయన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ, ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ పూర్వ విద్యార్థి. ఈయన గతంలో ‘విశిష్ట సేవా అవార్డ్‌’తో పాటు ‘అతి విశిష్ట సేవా మెడల్‌’ కూడా అందుకున్నారు. తన బెటాలియన్‌ను జమ్మూకశ్మీర్‌లో చక్కగా నడిపించినందుకు సేనా మెడల్‌ కూడా అందుకున్నారు. బిపిన్‌ రావత్‌ పదవీ విరమణ అనంతరం డిఫెన్స్‌ స్టాఫ్‌ మొట్టమొదటి చీఫ్‌గానూ పనిచేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు