ఆర్మీ కొత్త చీఫ్‌గా మనోజ్‌

1 Jan, 2020 04:39 IST|Sakshi

28వ సైన్యాధిపతిగా మంగళవారం బాధ్యతల స్వీకారం

పదవీ విరమణ చేసిన జనరల్‌ రావత్‌

సైనిక వ్యవహారాల విభాగం (డీఎంఏ)ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కొత్తగా ఏర్పాటైన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ (సీడీఎస్‌)కు అధిపతిగా కేంద్రం నియమించడంతో.. ఆర్మీ వైస్‌చీఫ్‌గా ఉన్న జనరల్‌ మనోజ్‌æ ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దుల్లో పెరిగిన చైనా దూకుడు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో 13 లక్షల సైన్యానికి అధిపతిగా మనోజ్‌ బాధ్యతలు చేపట్టారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను పట్టాలకెక్కించే బాధ్యత ఆయనపైనే పడింది. కాగా, సీడీఎస్‌ ఆధ్వర్యంలో నడిచే సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను ఏర్పాటు చేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మహారాష్ట్రలోని పుణేకు చెందిన మనోజ్‌(59)నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ మిలటరీ అకాడమీల్లో శిక్షణ పొందారు. 1980లో సిఖ్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌ 7వ బెటాలియన్‌లో చేరారు. 37 ఏళ్ల సర్వీసులో చైనాతో 4వేల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న ఈస్టర్న్‌ కమాండ్‌తోపాటు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లలో ఉగ్రవ్యతిరేక చర్యల్లో పాల్గొన్నారు. కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. శ్రీలంక వెళ్లిన శాంతి పరిరక్షణ దళంలోనూ, మయన్మార్‌లోను మూడేళ్లపాటు పనిచేశారు. సేనా పతకం, విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను ఈయన అందుకున్నారు.

ఉగ్రమూలాలపై దాడి చేసే హక్కుంది
పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆ దేశంలోని ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని కొత్త ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం. మనోజ్‌ స్పష్టం చేశారు. పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలపై ముచ్చటించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉగ్ర మూకల ఏరివేత, వారి నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంతో పాక్‌ ఆర్మీ పరోక్ష యుద్ధ వ్యూహం బెడిసికొట్టింది.

ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి’ అని తెలిపారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సరిహద్దులో పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో దృష్టంతా ఇప్పుడు పశ్చిమ సరిహద్దుల నుంచి ఉత్తర సరిహద్దుకు మారింది. ఉత్తర సరిహద్దుల్లో సన్నద్ధతను, సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాం’అని తెలిపారు. ఎప్పుడైనా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేలా సైన్యాన్ని సన్నద్ధం చేయడంపైనే తన దృష్టంతా ఉందని జనరల్‌ మనోజ్‌ అన్నారు.

కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం
రక్షణ శాఖలో కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సీడీఎస్‌గా నియమితులైన జనరల్‌ బిపిన్‌ రావత్‌ దీనికి నేతృత్వం వహించనున్నారని ప్రభుత్వం మంగళవారం తెలిపింది. త్రివిధ దళాలకు మాత్రమే సంబంధించిన కొనుగోళ్లను, మిలటరీ కమాండ్‌ల పునర్వ్యవస్థీకరణ, అన్ని కమాండ్‌లను సమన్వయ పరుస్తూ వనరులను గరిష్టంగా వినియోగపడేలా చూడటం డీఎంఏ బాధ్యతని పేర్కొంది.

త్రివిధ దళాల అవసరాలకు తగ్గట్లుగా కొనుగోళ్లు, శిక్షణ, సిబ్బంది నిర్వహణ చేపట్టడం తోపాటు దేశీయ తయారీ ఆయుధాల వినియోగాన్ని పెంచడం దీని లక్ష్యమని తెలిపింది.  ఇందుకు సంబంధించి 1961 నాటి భారత ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చేపట్టేందుకు రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదముద్ర వేశారని పేర్కొంది. కాగా, సీడీఎస్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని, దేశం తిరోగమనంలో పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం: జనరల్‌ రావత్‌
పాక్, చైనాల నుంచి సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సైన్యం పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణ పదవీ కాలంలో తాను సాధించిన అతిపెద్ద విజయాలని పేర్కొన్నారు. సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించడంతో ఆయన మంగళవారం ఆర్మీ చీఫ్‌గా బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సైనిక వందనం స్వీకరించారు. అనంతరం జనరల్‌ రావత్‌ మాట్లాడుతూ.. మూడేళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన సైనిక శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త చీఫ్‌ నేతృత్వంలో సైన్యం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సీడీఎస్‌ హోదాకు సంబంధించిన షోల్డర్‌ ర్యాంక్‌ బ్యాడ్జీ, కారుజెండా, టోపీ, యూనిఫాం గుండీలు, బెల్ట్‌

మరిన్ని వార్తలు