భద్రతా సంక్షోభంలో కాంగ్రెస్ నేతలు!

21 Feb, 2015 09:30 IST|Sakshi

న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ .... గత ప్రభుత్వ మంత్రుల భద్రతను తగ్గించడంతో వారు ఆందోళనకు గురువుతున్నారు. మరో విశేషమేమంటే.. గత ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారులను భద్రత నుంచి తొలగించి ప్రస్తుత ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. కేంద్రంలో అధికారం మారితే ...గత ప్రభుత్వ నేతలు, మంత్రులు తదితరుల రక్షణకు కొత్త సర్కార్ మంగళం పాడటం ఆనవాయితీగా వస్తున్నదే.

తాజాగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మాజీ మంత్రి మనీష్ తివారి, బొగ్గుశాఖ మాజీ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ లకు ఇప్పటివరకు కల్పిస్తోన్న 'జడ్' కేటగిరి భద్రతను తొలగించారు. అంతేకాకుండా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్తో పాటు మాజీ మంత్రి బేని ప్రసాద్ వర్మలకు కల్పిస్తోన్న 'జడ్' కేటగిరి భద్రతను 'వై' కేటగిరికి మార్చడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కాగా భద్రతా సంక్షోభంలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరితో పాటు రీటా బహుంగ జోషి, జితిన్ ప్రసాదా, పీఎల్ పునియా, ఆర్ పీఎన్ సింగ్, సలీం షెన్వారీ తదితరులు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నారు.   

బీఎస్పీ నేతలు బ్రజేష్ పాథక్, ధనంజయ్ సింగ్, సమాజ్ పార్టీ నేత అమర్ సింగ్లకు కూడా 'జడ్' కేటగిరి భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం కేవలం 'వై' కేటగిరి అందిస్తుంది. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్లు నీరజ్ కుమార్,  వైఎస్ దడ్వాల్లతో పాటు ఆర్మీ మాజీ చీఫ్ ఎన్ సీ విజయ్కి ప్రస్తుతం ఎలాంటి సెక్యురిటీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం సమాచారం ప్రకారం... 327 మంది వీఐపీల భద్రత అంశంపై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 20 మంది వీఐపీలు తమ భద్రత కేటగిరిని తగ్గించడంపై ఆందోళన చెందుతున్నారు.

ముజఫర్ నగర్లో మత ఘర్షణలతో సంబంధం ఉన్న బీజేపీ నేత సురేష్ రానాకు మాత్రం 'వై' కేటగిరి నుంచి జడ్ కేటగిరికి ప్రమోషన్ ఇస్తూ భద్రతను పెంచడం విశేషం. ఆయనతో పాటు బాబా రాందేవ్, యోగి ఆదిత్యనాథ్ లకు జడ్ స్థాయి భద్రతను కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం వారి రక్షణను పటిష్ట చర్యలు తీసుకుంది.

మరిన్ని వార్తలు