కార్మికులకు సాంఘిక భద్రత ఎప్పుడు ?

13 Jun, 2020 19:18 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో అనియత రంగంలో 46.60 కోట్ల మంది పని చేస్తుండగా, వారిలో కేవలం 9.3 శాతం మందికి మాత్రమే సాంఘిక భద్రత ఉంది. అంటే మిగతా 90.7 శాతం మందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఉద్యోగులు, శాసనసభ్యులు, జడ్జీలకు ఉపాధికి గ్యారంటీ లేదు. అందుకనే లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మంది వలస కార్మికులు ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయకుండా సొంతూళ్లకు బయల్దేరారు. జీ-20 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అనియత రంగంలో పని చేస్తున్న కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోనే భారత్‌ అయిదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడడానికి కూడా అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఎంతో కారణం. (ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..)

వీరందరికి సాంఘిక భద్రతను కల్పించేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రస్తుతం ఆ బిల్లుపై కేంద్ర కార్మిక శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ చర్చిస్తోంది. రానున్న 20 ఏళ్లలో దేశంలోని ప్రతి పౌరుడికి సాంఘిక భద్రతను కల్పించే దిశగా ఈ ముసాయిదా బిల్లు ఉండాలి. అయితే అలాంటి లక్ష్యమేదీ బిల్లుకు ఉన్నట్లు లేదు. 1923 నుంచి 2008 మధ్య తీసుకొచ్చిన ప్రజల సాంఘిక భద్రతకు సంబంధించిన చట్టాలను ఒకే బిల్లు చేయబోతున్నారు. అందులో ఎనిమిది బిల్లులు 20వ శతాబ్దం తర్వాత వచ్చినవే. (యువత అభిరుచులపై సర్వే )

రానున్న రెండు దశాబ్దాల్లోగా భారత్‌లోని జనాభాలో దాదాపు 15 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారే ఉంటారు. వారిలో ఎంతో మంది ఉద్యోగం చేయాలనుకోవచ్చు. అలాంటప్పుడు సాంఘిక  భద్రత కింద వారందరి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అవుతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఓ నిధి గురించి కొత్త కోడ్‌లో ప్రస్తావించారు తప్పా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. కొత్త బిల్లులో కాంట్రాక్టు కార్మికుల ఊసే లేకపోవడం అన్యాయమని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కంపెనీ యజమానులకు దళారి కాంట్రాక్టరు కార్మికులను సరఫరా చేస్తారు. వారిని కాంట్రాక్టర్‌ లేదా కంపెనీ యజమాని మోసం చేయడం తరచూ జరుగుతోంది. అలా జరగకుండా తగిన చర్యలను బిల్లులో ప్రతిపాదించాల్సిన అవసరం ఉందని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. (తప్పు చేసినవారే తప్పించుకునే యత్నం.. )

మరిన్ని వార్తలు