మావోయిస్టుల చేతిలో పాక్‌ ఆయుధాలు

15 Jun, 2019 15:54 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాల్లో నాటో, పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే ఆధునాతనమైన హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్‌లు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవి వీరికి ఎలా చేరాయి..? మావోస్టులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధం ఎంటీ..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై డీఎమ్ అవస్తి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే జీ 3 రైఫిల్‌ను మేము స్వాధీనం చేసుకున్నాం. ఇలా మరో దేశం ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. గతంలో కూడా మావోయిస్టుల వద్ద పాక్‌కు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయి. కాని అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలీలేదు’’ అని పేర్కొన్నారు. కాగా 2018 సంవత్సరంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్లో మావోల నుంచి జర్మన్‌లో తయారైన రైఫిల్, అమెరికాలో తయారైన సబ్- మెషిన్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విదేశాల్లో తయారైన టెలిస్కోప్‌లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు