మహారాష్ర్టలో రిజర్వేషన్లపై స్టే

15 Nov, 2014 03:11 IST|Sakshi
  • మరాఠాలు, మస్లింలకు కోటా కుదరదన్న బాంబే హైకోర్టు
  • సాక్షి, ముంబై: ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ర్టలో గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాంబే హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ అమలును కూడా కోర్టు నిలిపేసింది. అయితే విద్యా సంస్థల్లో వారి కోసం ప్రత్యేక కోటాను మాత్రం అనుమతించింది.

    ఈ అంశంపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మొత్తం సీట్లలో రిజర్వేషన్ల కోటా కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప 50 శాతాన్ని మించకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే నిబంధన విధించిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

    ఇప్పటికే రాష్ర్టంలో ఆయా వర్గాలకు కలిపి మొత్తంగా 52 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కోటా 73 శాతానికి పెరిగింది. పైగా వెనుకబడిన తరగతులపై ఏర్పాటైన జాతీయ కమిషన్ గతంలో ఇచ్చిన నివేదికలో మరాఠాలను బీసీలుగా పరిగణించరాదన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కాగా, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
     

>
మరిన్ని వార్తలు