కరోనాపై తప్పుడు ప్రచారం.. డాక్టర్‌కు నోటీసులు

17 Mar, 2020 15:47 IST|Sakshi

ముంబై : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసినందుకు మహారాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌  ముంబైకి చెందిన డాక్టర్‌ అనిల్‌ పాటిల్‌కు నోటీసులు ఇచ్చింది. ముంబైకి చెందిన అనిల్‌ పాటిల్‌ కరోనా వైరస్‌పై మాట్లాడుతూ ఒక వీడియానూ తీశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. ' కరోనావైరస్ పై ఎటువంటి  భయం అవసరం లేదు. భారతదేశం ప్రస్తుతం వేసవికాలంలో ఉంది. వేసవిలో వైరస్ మనుగడకు అవకాశం లేదు. చైనీయులు వ్యామోహం నుంచి ఈ వైరస్‌ పుట్టింది.. అంతేగాక  ఈ వ్యాధి మాస్క్‌లు తయారు చేసే కర్మాగారాలకు వ్యాపార అవకాశాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2002లో చైనాలో కనిపించిన తీవ్రమైన సార్స్‌ వ్యాధి భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇది కూడా అంతే ' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాటిల్‌ చేసిన వాదనలను ధృవీకరించడానికి ఏదైనా అధ్యయనం లేదా డేటాబేస్‌ లాంటిది ఉంటే చూపించాలంటూ మెడికల్‌ కౌన్సిల్‌ అతని నుంచి వివరణ కోరింది. (పాకిస్తాన్‌లో తొలి కరోనా మరణం)

ఇదే విషయమై.. ఎంఎంసి అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ ఉత్తేకర్  మాట్లాడుతూ.. 'వైరస్‌పై తప్పుడు ప్రచారం కల్పించినందుకు డాక్టర్ అనిల్ పాటిల్‌కు నోటీసు జారీ చేశాము. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సలహాదారులు తీసుకుంటున్న జాగ్రత్తలకు వ్యతిరేకంగా  పాటిల్‌ వ్యాఖ్యలు ఉన్నాయి.  భారత్‌లో కరోనా వ్యాప్తి అంతగా ఉండదని కొట్టిపారేస్తున్న పాటిల్‌కు తగిన ఆధారాలు చూపించాలని  మేము కోరాము'  అని పేర్కొన్నారు. కాగా పాటిల్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 126 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మంగళవారం మృతిచెందడంతో.. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య మూడుకి చేరింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 1, 82,611 కరోనా కేసులు నమోదయ్యాయి.
(కరోనా: వివాదం రేపిన ట్రంప్‌ ట్వీట్‌)

మరిన్ని వార్తలు