1,217 కోట్ల చోక్సీ ఆస్తుల అటాచ్‌

2 Mar, 2018 02:41 IST|Sakshi
గురువారం ఈడీ అటాచ్‌ చేసిన చోక్సీ ఆస్తులు

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీలకు చెందిన రూ. 1,217.2 కోట్ల విలువైన 41 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది. మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈ ఆస్తుల్ని అటాచ్‌ చేశారు. ఈ ఆస్తుల్లో ముంబైలోని 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని ఒక మాల్, అలీబాగ్‌లోని 4 ఎకరాల ఫాంహౌస్, నాసిక్, నాగ్‌పూర్,  తమిళనాడులోని విల్లుపురంలోని 231 ఎకరాల భూమి ఉన్నాయి.

పీఎన్‌బీ ఎండీ, సీఈవో సునీల్‌ మెహతాను ముంబైలో ఈడీ విచారించింది. సీబీఐ గురువారం తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.  సెంట్రల్‌ ముంబై శివారులో ఒక భవనంలో ని గది నుంచి లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌కు సంబంధించిన పత్రాల్ని సీజ్‌ చేశామని సీబీఐ అధికారులు చెప్పారు. డాక్యుమెంట్లు దాచిన ఆ ప్రాంతం నీరవ్‌ మోదీకి చెందినదని భావిస్తున్నారు. కాగా ఆయన ఏ దేశంలో ఉన్నారో అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని నీరవ్‌కు సీబీఐ లేఖలో సూచించింది.
 

మరిన్ని వార్తలు