రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

14 Jul, 2019 15:45 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ముగ్గురు యువతులు ఫ్రెండ్‌షిప్‌ పేరుతో వల వేసి ఓ వ్యాపారిని నిలువునా దోచుకున్న సంఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బికనీర్‌కు చెందిన విజయలక్ష్మి(25), కృష్ణ(21) అక్కా చెల్లెలు. వీరు బులంద్‌ షహర్‌కు చెందిన తమ దూరపు చుట్టం, వితంతువు సునీత(27)తో కలిసి స్నేహం పేరుతో ఓ వ్యాపారికి మాయమాటలు చెప్పి హోటల్‌ రూంకి తీసుకెళ్లి బాగా మద్యం తాగించారు. వ్యాపారి మత్తులో ఉండగా, అతని నుంచి రెండు ఫోన్లు, రెండు వాచీలు, కారు కాగితాలు తీసుకున్నారు. క్రెడిట్‌, డెబిట్‌, పేటీఎంల నుంచి 46 వేలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. వాటి పిన్‌ నంబర్లను మత్తులో ఉన్న వ్యాపారి నుంచే రాబట్టారు. అనంతరం ముగ్గురూ దర్జాగా క్యాబ్‌ బుక్‌ చేసుకుని వెళ్లిపోయారు. మత్తు దిగిన తర్వాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువతులను పట్టుకున్నారు. విచారిస్తే వీరు ఇంతకుముందు చాలా మందిని నిలువు దోపిడీ చేశారని తేలింది. అంతేకాక, నకిలీ గుర్తింపు కార్డులు చూపించి పబ్బుల్లో ఎలాంటి ఫీజు లేకుండా వెళ్లేవారని తేలింది. ఇంకా వీరి మీద ఎక్కడెక్కడ కేసులున్నాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తలు