15 రోజుల్లోనే రెట్టింపు అవుతున్న కరోనా కేసులు

5 Jun, 2020 10:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ వారం భారత్‌లో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటేశాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావిత దేశాల్లో భారత్‌ ఏడో స్థానానికి చేరుకుంది. ఇది ఇలానే కొనసాగితే జూన్‌ నెల మధ్య వరకు కరోనా కేసుల్లో భారత్‌ నాలుగో స్థానానికి చేరుతుందంటున్నారు నిపుణులు. మే 2 నుంచి భారత్‌లో ప్రతిరోజు 8వేల పైగా కేసులు నమోదు అవుతూ.. జూన్‌ 2నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. జూన్‌ 4న ఏకంగా 9 వేలకు పైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తుంది. ప్రస్తుతం ప్రతి 15 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

నేటికి(గురువారం) ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో భారత్‌.. ఇరాన్, జర్మనీ, ఫ్రాన్స్‌లను అధిగమించి ఏడో స్థానానికి చేరుకుంది. గత వారం నుంచి ప్రతి రోజు అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌.. బ్రెజిల్, అమెరికా, రష్యా  తరువాతి స్థానంలో నిలిచింది. అంతేకాక గత వారం నుంచి మనదేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఇలానే స్థిరంగా కొనసాగితే.. ఈ వారం చివర వరకు మన దేశం ఇటలీ, స్పెయిన్‌లను అధిగమిస్తుంది. ఈ నెల మధ్య వరకు కరోనా కేసుల సంఖ్యలో భారత్‌ యూకేను అధిగమించి 4వ స్థానానికి చేరుకుంటుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రస్తుతం యూరోప్‌ దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.(భయం వద్దు.. ప్లాస్మాథెరపీ ఉంది!)

ప్రపంచంలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రస్తుతం మన దేశంలో ప్రతి పది లక్షల మందిలో కేవలం 80 మందికే పరీక్షలు జరుపుతుండగా.. 8వేల కేసులు బయటపడుతున్నాయి. పెరు కంటే కూడా మన దేశంలో తక్కువ టెస్టులు జరుగుతున్నాయి. అలా కాకుండా రష్యా మాదిరిగా రోజు ప్రతి పది లక్షల మందిలో 2 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తే.. ఎక్కువ సంఖ్యలో కేసులు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. (నర్సుగా సేవలందించిన తనకే..)

మరిన్ని వార్తలు