'క్షమించండి.. అది కావాలని చేయలేదు'

23 May, 2020 10:45 IST|Sakshi

ఢిల్లీ : లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని భావించిన వలసకూలీలకు ఢిల్లీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. సొంతూళ్లకు వెళ్లేందుకని శ్రామిక్‌ రైలు ఎక్కేందుకు వచ్చిన వలస కూలీలు ముందుగా హెల్త్‌ స్ర్కీనింగ్‌ కోసం ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఉన్న పాఠశాలకు చేరుకొని పరీక్షల కోసం క్యూలో నిల్చున్నారు. ఇంతలో అక్కడికి క్రిమి సంహారక మందు చల్లేందుకని సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డీఎంసీ) అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు క్రిమి సంహారక మందు చల్లే సమయంలో పొరపాటున జెట్టింగ్‌ మిషన్‌లోని రీకాయిల్ డైరెక్షన్‌ మారడంతో ఆ మందు మొత్తం వలస కూలీలపై విరజిమ్మింది. దీంతో అక్కడ నిల్చున్న వలస కూలీలు స్ర్పే ఒత్తిడి దాటికి తట్టుకోలేక కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు.

అయితే ఈ ఘటనపై  ఎస్‌ఎండీసీ స్పందిస్తూ.. ' క్షమించండి.. అది కావాలని చేసింది కాదు. క్రిమి సంహారక మందు చల్లుతున్న సమయంలో పొరపాటుగా జెట్టింగ్‌ మిషన్‌ డైరెక్షన్‌ మారడంతో వలస కూలీలపైకి స్ర్పే వెళ్లింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే ఉహించిన తాము సిబ్బందికి స్ర్పే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించాం. అయినా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. అయితే స్ర్పే సమయంలో జెట్టింగ్‌ మిషన్‌లో రీకాయిల్‌పై ఒత్తిడి పెరగడంతోనే ఇలా జరిగిందంటూ'  తెలిపింది. కాగా వలస కూలీలకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాల జనావాసాలకు దగ్గరగా ఉండడంతో అక్కడి ప్రజల విజ్ఞప్తి​ మేరకు ప్రతిరోజు పాఠశాల పరిసరాలతో పాటు రోడ్లు మీద క్రిమి సంహారక మందు చల్లుతున్నట్లు ఎస్‌ఎండీసీ పేర్కొంది.
(24 గంటల్లో.. 6654 కరోనా కేసులు)
(జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక)


 

మరిన్ని వార్తలు