దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి

4 Mar, 2020 13:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడి కారణంగా ఆగ్రాలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఆరుగురికి వైరస్‌ సోకింది. దేశంలో పర్యటిస్తున్న 21 మంది ఇటలీ జాతీయుల్లో 16 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిని చావ్లాలో ఉన్న ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు క్వారంటైన్‌కు తరలించాం’’ అని పేర్కొన్నారు.  ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 5,89,000 వేల మందికి ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ నిర్వహించామని పేర్కొన్నారు. అదే విధంగా నేపాల్‌ సరిహద్దులో సైతం స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్‌ తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. (హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!)

అదే విధంగా విదేశాల్లో ఉండి కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్న భారత పౌరుల గురించి మాట్లాడుతూ... ఇరాన్‌ గనుక సహకరించినట్లయితే అక్కడ ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. త​ద్వారా స్క్రీనింగ్‌ చేసిన అనంతరం వారిని భారత్‌కు రప్పించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల ధర పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు కరోనా వైరస్ కట్టడిపై చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రుల బృందం భేటి కానుంది. 

28 పాజిటివ్ కేసులు:
ఢిల్లీ -1
తెలంగాణ- 1
ఆగ్రా- 6
కేరళ- 3
16 మంది ఇటాలియన్‌ టూరిస్టులు
వారితో పాటు ప్రయాణించిన డ్రైవర్‌(ఇండియన్‌ డ్రైవర్‌)

>
మరిన్ని వార్తలు