‘నేను కోతి పిల్లను కాను’ : కేంద్ర మంత్రి

1 Jul, 2018 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ నేను కోతి పిల్లను కానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ఛార్లెస్‌ డార్విన్‌ జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా సరైనది కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. ఇది నేను సరాదాకు చెప్పింది కాదు.. నేను సైన్స్‌ విద్యార్థిని కాబట్టే ఇది తప్పని చెప్పాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడలనుకుంటే మాట్లాడొచ్చు.. కానీ నాకు మద్దతుగా ఉండేది.. వ్యతిరేకించగా నిలిచేది ఎందరో చూడాలి.

ప్రస్తుతం ఉన్న పుస్తకాలు.. మన పూర్వీకులు కోతులని.. మనం కోతి పిల్లలనేలా ఉన్నాయి. కానీ దానిని నేను అంగీకరించను. చాలా మంది మీడియాకు భయపడి నిజాలు మాట్లాడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు నిజాలనే మాట్లాడాలి. ప్రజలు నెమ్మదిగా నేను చెప్పిన దాన్ని అంగీకరిస్తారు. ఇంకో పదేళ్లలో నేను చెప్పింది నిజమని నమ్ముతారు. ప్రస్తుత పాఠ్యాంశాలు పిల్లలకు భారతీయ సంస్కృతిని తెలిపే విధంగా లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యవిధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నేను చదువుకున్న రాజకీయ నాయకుడిని.. అందుకు గర్వపడుతున్నాన’ని అన్నారు.

గతంలో ఛార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని సత్యపాల్‌ సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు పిల్లలకు ఈ సిద్ధాంతాన్ని భోదించడం ఆపేయాలని కూడా ఆయన అన్నారు. సత్యపాల్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వివరణ కోరిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు