అత్యాచారం చేసి.. ఉరేశారు!!

4 Jun, 2014 10:37 IST|Sakshi

ఉత్తరప్రదేశ్ పూర్తిస్థాయిలో అత్యాచారాల రాజధానిగా మారిపోయింది. 15 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను చెట్టుకు ఉరేశారు. తన కూతురిపై అఘాయిత్యం చేశారని, తర్వాత ఉరేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతాపూర్ జిల్లాలోని మిష్రిఖ్ గ్రామ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బేణీపూర్ మజ్రా సర్సాయ్ వద్ద గల పొలాల్లోకి వెళ్లిన ఆ బాలిక ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత ఇంటికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఆమెను తరచు వేధించేవాడని, దాని గురించి ఇంట్లో చెబుతానంటే బెదిరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు ఫిర్యాదు అందిందని, కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తామని అన్నారు. బడౌన్ ప్రాంతంలో ఇద్దరు అక్కచెల్లెళ్లపై అత్యాచారం చేసి వారిని హతమార్చిన సంఘటన జరిగి వారం రోజులు కూడా కాకుండానే యూపీలో అనేక అత్యాచారాలు బయటపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు