మైనర్‌ బాలిక ‘అమ్మ’ అయింది.. బిడ్డను వదిలేసింది

30 Sep, 2019 12:08 IST|Sakshi

బారెల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్‌ బాలిక.. సమాజంలో పరువు పోతుందని నవజాత శిశువును ఆస్పత్రిలోనే వదిలి వెళ్లేందుకు యత్నిచింది. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శిశువుకు ఎలాంటి హానీ కలగలేదు. ఈ ఘటన యూపీలోని బారెల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్‌ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు. ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని, బిడ్డ పుట్టిందని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని శిశువును అక్కడే వదిలి వేళ్లేందుకు ప్రయత్నించింది సదరు మైనర్‌ బాలిక. 

బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి తండ్రితో కలిసి బయటకు వెళ్లేందుకు యత్నిచింది. గమనించిన ఆస్పత్రి సిబ్బంది వారిని బందించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలిక తండ్రిని విచారించారు. అయితే కూతురు గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని, కడుపు నొప్పి అని ఆస్పత్రికి తీసుకొచ్చానని బాలిక తండ్రి వివరించారు. బాలికను విచారించగా.. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆ బిడ్డను తీసుకెళ్లనని తేల్చి చెప్పింది. శిశు సంక్షేమ కమిటీ వచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చినా.. బాలిక తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ ఘటనపై శిశు సంక్షేమ కమిటీ సభ్యులు డీఎన్‌ శర్మ మాట్లాడుతూ... తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సమాజంలో పరువుపోతుందని బిడ్డను తీసుకెళ్లడం లేదని బాలిక చెబుతోంది. కౌన్సిలింగ్‌ ఇచ్చినా కూడా తాను మారడం లేదు. బిడ్డను తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే రెండు నెలల తర్వాత మేమే శిశు సంక్షేమ సెంటర్‌కి తీసుకెళ్తాం. కావాల్సిన వారికి దత్తత ఇస్తాం’  అని పేర్కొంది. 

మరిన్ని వార్తలు