మరోసారి చరిత్రను తప్పుగా చెప్పిన మోదీ..!

29 Jun, 2018 09:39 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం మఘర్‌లో జరిగిన ప్రవక్త, కవి సంత్‌ కబీర్‌దాస్‌ 500వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘శాంతి, సామరస్యంతో ఎలా జీవించాలనే సందేశాన్ని మహత్మ కబీర్‌ బోధించారు. నిర్వాణ్‌ గడ్డపై పుట్టినందుకు నేను మరోసారి ఆ మహానుభావునికి వందనాలు చేస్తున్నాను. కబీర్‌, గురు నానక్‌, బాబా గోరఖ్‌నాథ్‌లు కలసి ఆధ్యాత్మికతపై చర్చించేవార’ని తెలిపారు.

కబీర్‌, గురు నానక్‌, గోరఖ్‌నాథ్‌లు కలసి చర్చించేవారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ చేసిన ప్రసంగంలో తప్పులున్నాయని.. ఆయన చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అంటున్నారు. వారి వాదన ప్రకారం.. ‘వీరు ముగ్గురు వేరువేరు కాలాల చెందిన వారు. కానీ మోదీ వీరు ముగ్గురు చర్చలు జరిపారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. గోరఖ్‌నాథ్‌ కబీర్‌ ముందుతరం వారయితే.. గురు నానక్‌ కబీర్‌ తర్వాతి తరానికి చెందినవారు. గోరఖ్‌నాథ్‌ 11వ శతాబ్దంలో జన్మిస్తే.. కబీర్‌ 1398-1539 మధ్య కాలానికి చెందినవారు. అలాగే గోరఖ్‌నాథ్‌ 1469-1539 మధ్య జీవించారు. ఒకవేళ గోరఖ్‌నాథ్‌, కబీర్‌ చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ.. వారు ఇరువురు ఆధ్యాత్మికతపై చర్చించారని చెప్పడం కాస్త నమ్మశక్యంగా లేదు’.

కాగా, గతంలో కూడా మోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. 2013లో పట్నాలో జరిగిన ర్యాలీలో బిహార్‌ గొప్పతనం గురించి మాట్లాడుతూ.. అశోక చక్రవర్తి, నలంద, తక్షశిల పేర్లను ఊదహరించారు. గతంలో పంజాబ్‌ భూభాగమైన తక్షశిల ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. అలాగే యూఎస్‌లో మోదీ ప్రసంగిస్తూ కోణార్క్‌ సూర్య దేవాలయం 2 వేల సంవత్సరాల పురాతనమైనదని తెలిపారు. కానీ అది 700 ఏళ్ల కిందట నిర్మితమైన కట్టడమని చర్రిత పుటల్లో ఉంది.

చదవండి: మోదీకి చరిత్ర చెప్పే మగాడే లేడా?!

మరిన్ని వార్తలు