అక్బర్‌పై ఆరోపణలు : సంచలన విషయాలు వెల్లడించిన భార్య

2 Nov, 2018 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ :మీటూ ఉద్యమం’లో భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో జర్నలిస్ట్‌గా స్థిరపడిన పల్లవి గొగోయ్‌.. ఎంజే అక్బర్‌ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. అయితే పల్లవి గొగోయ్‌ చేసిన ఆరోపణలపై ఎంజే అక్బర్‌తో పాటు ఆయన భార్య మల్లికా అక్బర్‌ కూడా స్పందించారు. అక్బర్‌పై ఎంతమంది ఆరోపణలు చేసిన పెదవి విప్పని ఆయన భార్య పల్లవి గొగోయ్‌ ఆరోపణల విషయంలో మాత్రం తన భర్తకు మద్దతుగా నిలవడమే కాకా ఆమె అబద్దాలు ప్రచారం చేస్తోందంటూ పల్లవి గొగోయ్‌పై మండి పడ్డారు.

పల్లవి గొగోయ్‌ ఆరోపణలపై స్పందించిన ఎంజె అక్బర్‌.. ‘1994 సమయంలో పరస్పర అంగీకారంతో మా ఇద్దరి(పల్లవి గొగోయ్‌, తనకు) మధ్య ఒక బంధం ఉన్న మాట వాస్తవం. ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది. మా బంధం గురించి అందరికి తెలుసు. చాలా మంది మా ఇద్దరి గురించి మాట్లాడుకునే వారు. దీని వల్ల నా ఇంటిలో కలతలు కూడా చెలరేగాయి. కొన్నాళ్లకు ఈ బంధం ముగిసింది. అయితే ఈ బంధానికి ఒక మంచి ముగింపు మాత్రం ఇవ్వలేకపోయాము’ అంటూ అక్బర్‌ చెప్పుకొచ్చారు.

అక్బర్‌ భార్య మల్లికా అక్బర్‌ మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల క్రితం పల్లవి గొగోయ్‌ మా కాపురంలో కలతలు రేపింది. పల్లవి రాత్రి పూట నా భర్తకు ఫోన్‌ చేసేది. పబ్లిక్‌లో నా ముందే నా భర్త మీద ప్రేమ చూపించేది. వీటన్నింటిని చూసిన తర్వాత నాకు వారి బంధం గురించి పూర్తిగా అర్థమయ్యింది. ఈ విషయం గురించి మా భార్యభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. చివరకూ నా భర్తలో మార్పు వచ్చింది. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు. అంతేకాక ఇప్పుడు పల్లవి ఎందుకు ఇలాంటి అబద్దాలు చెప్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. పల్లవి చేసిన ఆరోపణలన్ని అవాస్తవాలేనంటూ ఖండించారు.

మరిన్ని వార్తలు