ఎమ్మెల్యేను తరిమి కొట్టిన జనాలు..!?

17 Jul, 2018 10:30 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే శంకర్‌ లాల్‌ శర్మగా భావిస్తున్న వ్యక్తి (వీడియో ఆధారంగా)

జైపూర్‌ : ప్రజాస్వామ్య దేశంలో అప్పుడప్పుడు నాయకులు ఓటరు దేవుళ్ల అసంతృప్తిని చవిచూడక తప్పదు. కానీ ఓటర్లు రెబల్‌గా మారి నేతలను తరిమి కొట్టడం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌ ప్రజలు ఒక ఎమ్మెల్మేను తరిమి తరిమి కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. అంతేకాక ఈ వీడియోలో ఉన్న నేత రాజస్థాన్‌ దౌసా ప్రాంతానికి చెందిన శంకర్‌ లాల్‌ శర్మ అనే బీజేపీ ఎమ్మెల్యేగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

జులై 13నుంచి ఇప్పటి వరకూ ఈ వీడియోను దాదాపు 60 వేల మంది చూశారు. అయితే అసలు విషయం తాజాగా బయటపడింది. ఆ వీడియోలో తెల్లని కుర్తా పైజామా ధరించిన వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే అని.. కానీ అతను దౌసా ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే మాత్రం కాదని వెల్లడైంది. వీడియోలో జనాలు వెంటబడి మరి తరుముతున్న వ్యక్తి గంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే అని బయటపడింది. ఈ విషయం గురించి దౌసా బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్‌ శర్మ ‍స్పందిస్తూ.. ‘నా పేరు మీద ప్రచారం అవుతున్న ఈ వీడియో ఏప్రిల్‌ నుంచి సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. వైరల్‌ టెస్ట్‌లో ఈ విషయం తెటతెల్లమయ్యింది. నా పేరు మీద ఇలా నకిలీ వీడియోలను ప్రచారం చేసినందుకు గాను మా పార్టీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ ఎదుట నిరసన కూడా తెలిపారు. వీడియోలో ఉన్నది నేను కాదు.

ఆ వీడియోలో జనాలు తరిమికొడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోమని నా పార్టీ కార్యకర్తలకు చెప్పాను. వారి పరిశీలనలో జనాలు తరుముతున్న వ్యక్తి గంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రంకేశ్‌ మీనా అని తేలింది. ఈ వీడియోను భారత్‌ బంద్‌ సందర్భంగా తీశారు. సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపధ్యంలో నిరసన తెలుపుతుండగా తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో జనాలు తరిమికొడుతున్నది కాంగ్రెస్‌ నేత రంకేశ్‌ మీనానే’ అని తెలిపారు. రంకేశ్‌ మీనా 2009లో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే ఈ వీడియో విషయం గురించి రంకేష్‌ను సంప్రదించగా అతడు దీని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

మరిన్ని వార్తలు