ఆశా వర్కర్లపై దాడి.. కరోనా టెంట్లు ధ్వంసం

20 Apr, 2020 11:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పోకిరీలు రెచ్చిపోతున్నారు. వైద్య, పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడి, కరోనా అనుమానిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాష్ట్ర పోలీసు అధికారి బీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం. పశ్చిమ బెంగళూరు పరిధిలోని పెద్దనారాయణపురంలో ఈనెల మొదటి వారంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ ముగ్గురు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల గుర్తించారు.

దీంతో ఆ ముగ్గురు యువకులు నివహిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చూట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా వారిలో వైరస్‌ లక్షణాలు కనిపించిన పలువురికి ఇంట్లోనే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అక్కడి చేరుకున్న ఆశా వర్కర్లు, పోలీసులపైకి కొందరు యువకులు దాడికి దిగారు. బారికేడ్లను ధ్వంసం చేసి వైద్య పరికరాలను పగటకొట్టారు. ఈ ఘటనలో పలువురు ఆశా వర్కర్లు గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు భారీ బందోబస్త్‌తో ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడికి పాల్పడిన వారిలో 58మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అలాగే మిగతా వారిపై నిర్బంధం కొనసాగిస్తామని తెలిపారు. తాజాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పందించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆశా వర్కర్లు, వైద్య చికిత్స అందిస్తున్న సిబ్బందికి భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు