లోయలో ఇంటర్నెట్‌ ఎప్పుడు?

28 Dec, 2019 02:43 IST|Sakshi

కార్గిల్‌లో 145 రోజుల తర్వాత మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవల పునరుద్దరణ

శ్రీనగర్‌: లద్దాఖ్‌లోని కార్గిల్‌ జిల్లాలో 145 రోజుల తర్వాత శుక్రవారం మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు పునఃప్రారంభం కాగా కశ్మీర్‌ లోయలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మోదీ నేతృత్వంలోని కేంద్రసర్కారు ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఇప్పటికే 145 రోజులవుతోంది. గత నాలుగు నెలల నుంచి కార్గిల్‌లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగనందున అక్కడ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ సేవలను దుర్వినియోగం చేయొద్దని అక్కడి మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌–370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసినప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కశ్మీర్‌లో గత 145 రోజులుగా డిజిటల్‌ బ్లాకవుట్‌ కొనసాగుతుండగా ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతోందో తెలియదు. సమీప భవిష్యత్తులో సేవలను పునఃప్రారంభించే సూచనలు కూడా కనిపించడం లేదు. 

మరిన్ని వార్తలు