నావిక్‌తో ‘హెచ్చరికలు’

8 Sep, 2018 03:26 IST|Sakshi

బెంగళూరు: దేశీయంగా అభివృద్ధి చేసిన జీపీఎస్‌ వ్యవస్థ ‘నావిక్‌’తో ప్రకృతి విపత్తులు, తుపానులు, సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దులపై మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయవచ్చునని ఇస్రో శాస్త్రవేత్త నీలేశ్‌ దేశాయ్‌ వెల్లడించారు. ఇందుకోసం తాము ప్రత్యేకంగా ఓ పరికరాన్ని తయారు చేస్తున్నామన్నారు. బెంగళూరులో జరుగుతున్న స్పేస్‌ ఎక్స్‌పోలో శుక్రవారం నీలేశ్‌ మాట్లాడుతూ ఈ పరికరం తక్కువ ధరకే లభిస్తుందనీ, సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా జాలరులకు తెలియజేస్తుందని చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో ఓక్కి తుపాను విరుచుకుపడినప్పుడు కేరళలో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ పరికరాన్ని తయారుచేసినట్లు ఆయన చెప్పారు. తుపానుల వంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు ముందుగానే మత్స్యకారులకు హెచ్చరించి వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేందుకు ఈ పరికరం ఉపకరిస్తుందని నీలేశ్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు