18 బుల్లెట్‌ ట్రైన్‌లు దూసుకొస్తున్నాయ్‌..

5 Sep, 2018 15:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జపాన్‌ నుంచి రూ 7000 కోట్లు వెచ్చించి 18 బుల్లెట్‌ ట్రైన్లను కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బుల్లెట్‌ ట్రైన్‌ ఒప్పందంలో భాగంగా స్ధానికంగా వాటి తయారీకి అవసరమైన సాంకేతికతను కూడా జపాన్‌ భారత్‌కు బదలాయిస్తుందని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ప్రతి బుల్లెట్‌ ట్రైన్‌లో 10 కోచ్‌లు ఉంటాయని, ఈ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతదాయని ఓ అధికారి వెల్లడించారు.

జపాన్‌ బుల్లెట్‌ ట్రైన్‌లు ప్రపంచంలో అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. వీటిలో భద్రతకు అనువుగా ఆటోమేటిక్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్ధ ఉండటం బుల్లెట్‌ ట్రైన్‌ల ప్రత్యేకతగా చెబుతారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని భారత రైల్వేలు యోచిస్తున్నాయని కూడా అధికారులు వెల్లడించారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు తాము బిడ్‌లను ఆహ్వానిస్తామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది.

మరోవైపు కవసకి, హిటాచి వంటి జపాన్‌ ట్రైన్‌ టెక్నాలజీ కంపెనీలు దేశంలో తమ ప్లాంట్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మరోవైపు ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు ముందుకు కదిలేందుకు అవరోధాలు వీడలేదు. పాల్ఘర్‌ వద్ద ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై నెలకొన్న వివాదం బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారింది.

మరిన్ని వార్తలు