లోక్‌సభ ముందుకు ట్రిపుల్‌ తలాక్‌ తాజా బిల్లు

27 Dec, 2018 09:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌పై తాజా బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్‌ తలాక్‌ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌ను ఆరునెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది.

మోదీ ప్రభుత్వం గతంలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా బిల్లును లోక్‌సభ ఆమోదించగా, ఎన్డీఏకు మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లుపై గందరగోళం చెలరేగింది. దీనిపై పాలక, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. దీంతో ట్రిపుల్‌ తలాక్‌పై తాజా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే క్రమంలో గురువారం బిల్లును ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది.

ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్పష్టంగా వెల్లడించినా ఈ పద్ధతిలో విడాకులు ఇవ్వడం కొనసాగుతోందని తాజా బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. మరోవైపు 430 ట్రిపుల్‌ తలాక్‌ ఘటనలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయని శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వీటిలో 201 ట్రిపుల్‌ తలాక్‌ ఘటనలు సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం చోటుచేసుకున్నవి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు