మోడీ భారత్‌ను హిందూ దేశంగా మారుస్తారు

25 Jul, 2014 02:06 IST|Sakshi

పణజీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తారంటూ గోవా సహకార మంత్రి దీపక్ ధావలికర్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి నరేంద్రమోడీని అభినందిస్తూ చేసిన తీర్మానంపై గురువారం దీపక్ గోవా అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మోడీజీ నాయకత్వంలో భారత్ హిందూ దేశంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ఈ దిశగా ప్రధాని పనిచేస్తారని నేను భావిస్తున్నా..’’ అని దీపక్ అన్నారు. దీపక్ సోదరుడు, రవాణా మంత్రి సుదిన్ కొద్ది రోజుల క్రితం బీచ్‌ల్లో బికినీలపై నిషేధం విధించాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన ఘటన మరువక ముందే దీపక్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
బీజేపీ కూటమిలోని మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన దీపక్, సుదిన్.. మనోహర్ పారికర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మరోవైపు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే మౌవిన్ గొడిన్హో మోడీని దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పనితీరు, నాయకత్వ లక్షణాలు, ఆలోచనా విధానం ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు చూడగలిగామని కొనియాడారు. మోడీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆయన గెలుపు చారిత్రకమని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు