మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హతం..

24 Feb, 2018 17:07 IST|Sakshi

భీకర ఎన్‌కౌంటర్‌లో సోహన్‌ను అంతమొందించిన బలగాలు

గౌహతి :  మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో భద్రత బలగాలు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ని మట్టుబెట్టాయి. ఉగ్రసంస్థ గారో నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ(జీఎన్‌ఎల్‌ఏ) చీఫ్‌ కమాండర్‌ సోహన్‌,  భద్రతా దళాలు జరిపిన భీకర ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. గారో హిల్స్‌లో సోహన్‌ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. గారోహిల్స్‌ పోలీసు, మేఘాలయ స్పెషల్‌ ఫోర్స్‌-10 కమాండోస్‌ సంయుక్తంగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉదయం 11.50కి సోహన్‌ మృతిచెందాడు.

గత ఆదివారం ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జొనాథోన్‌ ఎన్‌ సంగ్మాతోపాటు మరో ముగ్గురిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిని, పోలీసులు తీవ్రంగా పరిగణించారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రజలను భయపెట్టేందుకే తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రత్యేక భద్రతా బలగాలను  రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో తీవ్ర గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు ఉదయం జరిపిన ఎన్‌కౌంటర్‌లో సోహన్‌ని అంతమొందించాయి. 2009లో ఏర్పడిన జీఎన్‌ఎల్‌ఏ గారో ల్యాండ్‌ సౌరభౌమాధికారం కోసం పోరాడుతుంది.


 

మరిన్ని వార్తలు