నిత్యావసరాల ధరలు దిగి రానున్నాయా?

18 Dec, 2018 19:20 IST|Sakshi

99 శాతం వస్తువులు 18 శాతం జీఎస్‌టీ శ్లాబులోకి : ప్రధాని మోదీ

కొన్ని విలాస వస్తువుల మాత్రమే 28శాతం పన్ను

సాక్షి,న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని మరింత సరళం చేయనున్నామని, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హింట్‌ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రసంగించిన మోదీ  సామాన్యులు వినియోగించే దాదాపు అన్ని వస్తువులను 18 శాతం, లేదా దాని కంటే తక్కువ శాతం జీఎస్‌టీ శ్లాబులోకి తీసుకురానున్నామని చెప్పారు. 99 శాతం వస్తువులను 18శాతం జీఎస్‌టీ శ్లాబులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని  వెల్లడించారు.  అలాగే ప్రస్తుత 2 శాతం జీఎస్‌టీ శ్లాబులో కొన్ని లగ్జరీ వస్తువులను మాత్రమే పరిమితం  చేస్తామని ప్రధాని తెలిపారు.

జీఎస్‌టీ ప్రారంభానికి ముందు దేశంలో 65 లక్షల రిజిస్టర్ అయిన  వ్యాపారస్తులు ఉండగా, ఇప్పుడు 55 లక్షలమంది  అదనంగా  రిజిస్టర్  అయ్యారని ప్రధాని తెలిపారు.  దేశంలో అతి చిన్న పన్ను సంస్కరణలు చేపట్టడం కూడా చాలా సంక్లిష్టమైన అంశంగా ఆయన వ్యాఖ్యానించారు.  దేశంలో అవినీతిని రూపుమాపడానికి తన ప్రభుత్వం  కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేశంలో అవినీతి పట్ల తేలిగ్గా స్పందిస్తున్నారని, ఆ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

2014 నాటికి దేశంలోని 55 శాతం గృహాలు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నాయని  అయితే తమ హయాంలో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వివరించారు. అలాగే దశాబ్దల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందపి ఆయన చెప్పారు. కొత్త భారతదేశం నిర్మించే దిశగా తాము సాగుతున్నామన్నారు.

జీఎస్‌టీ విధానాన్ని సరళీకరణ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ వినిపిస్తున్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నిలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ నేపథ్యంలో 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకొస్తామని ప్రధాని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు