చేతులెత్తి నమస్కరిస్తున్నా.. పరిష్కరించండి

5 May, 2018 01:43 IST|Sakshi

కంటోన్మెంట్‌ ప్రజల సమస్యలపై ఎంపీ మల్లారెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర  మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ సీహెచ్‌ మల్లారెడ్డి కోరారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కంటోన్మెంట్‌ బోర్డుల ప్రతినిధుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ కూడా పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘కంటోన్మెంట్‌ ప్రజలు ఏళ్లుగా ఇక్కడ పన్నులు కడుతున్నారు. కానీ వారికి నిత్యం ఇక్కట్లే.

ఇది మిలటరీ రోడ్డు ఇక్కడికి రావద్దంటూ స్థానిక మిలిటరీ సిబ్బంది గన్‌ పట్టుకుని బెదిరిస్తున్నారు. దీంతో స్థానికులు తాము భారతదేశంలోనే ఉన్నామా లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ మంత్రికి చేతులెత్తి నమస్కరిస్తున్నా.. త్వరగా సమస్యను పరిష్కరించండి. అప్పటి రక్షణ శాఖ మంత్రి శంకుస్థాపన చేసిన ఆస్పత్రి ఇప్పటికీ ప్రారంభం కాలేదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు