డ్రగ్స్‌కు బానిసైన యువతికి ఎంపీ బాసట

29 Aug, 2019 08:15 IST|Sakshi

చండీగఢ్‌ : డ్రగ్స్‌కు బానిసైన కుమార్తెను స్వయంగా కన్నతల్లే మంచానికి చైన్‌లతో కట్టిపడేసిన ఉదంతం పంజాబ్‌లో డ్రగ్స్‌ మత్తులో యువత కూరుకుపోయిన వైనాన్ని వెల్లడించింది. డ్రగ్స్‌ మత్తులో జోగుతున్న కుమార్తెను బయటకు వెళ్లకుండా మంచానికే పరిమితం చేసేందుకు ముందు ఆమె తమ కూతురికి డ్రగ్స్‌ మత్తు వదిలించాలని ప్రభుత్వం నిర్వహించే డీ అడిక్షన్‌ సెంటర్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ ఉదంతం మీడియాలో వెలుగుచూడటంతో అమృత్‌సర్‌ ఎంపీ, కాంగ్రెస్‌ నేత గుర్జీత్‌ సింగ్‌ యువతి కుటుంబాన్ని సందర్శించారు.

యువతిని డ్రగ్స్‌ మత్తు నుంచి పూర్తిగా కోలుకునేలా వైద్య సాయం అందిస్తామని ఆమె తల్లికి ఆయన హామీ ఇచ్చారు. యువతి ఇంటిలోనే ఆమెకు పూర్తిస్ధాయిలో చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. తన కుమార్తెను పలుమార్లు ప్రభుత్వ డీఅడిక్షన్‌ కేంద్రాల్లో చేర్పించినా వారు అక్కడ కేవలం నాలుగైదు రోజులు ఉంచుకుని పంపేవారని, డ్రగ్స్‌కు బానిసైన వారు కేవలం కొద్దిరోజుల్లోనే ఎలా కోలుకుంటారని ఆమె ప్రశ్నించారు. తన కుమార్తె పూర్తిగా కోలుకునేవరకూ చికిత్స అందించాలని వైద్యులను కోరినా వారు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. పంజాబ్‌లో డ్రగ్స్‌కు అలవాటుపడిన మహిళలకు సంబంధించిన డేటా అందుబాటులో లేకపోవడం గమనార్హం. మహిళల కోసం ప్రత్యేకించి కేవలం ఒక డీ అడిక్షన్‌ సెంటర్‌ మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.

చదవండి : డ్రగ్స్‌కు బానిసైన కుమార్తెను

మరిన్ని వార్తలు