జాబ్‌ పేరుతో వసూళ్లు : ముకుల్‌ రాయ్‌ బావమరిది అరెస్ట్‌ 

6 May, 2018 15:21 IST|Sakshi
మాజీ కేంద్ర మంత్రి ముకుల్‌ రాయ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, కోల్‌కతా : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ బావమరిది సృజన్‌ రాయ్‌ను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఆదివారం ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. సృజన్‌ రాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లా బిజ్పూర్‌ పీఎస్‌కు చెందిన పోలీసు బృందం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేసింది. ఆరేళ్ల కింద బాధితులు ఇచ్ని ఫిర్యాదుపై ఆయనను అరెస్ట్‌ చేశామని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. మోసం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద రాయ్‌పై కేసునమోదైందని చెప్పారు. జిల్లా కోర్టులో నిందితుడిని హాజరుపరచగా, 12 రోజుల పోలీసు కస్టడీకి మేజిస్ట్రేట్‌ ఆదేశాలిచ్చారని చెప్పారు.

కాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, 2012లో కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించిన ముకుల్‌ రాయ్‌ దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తన బావమరిదిపై కేసులు నమోదు చేసినా పాలకులు తనను టార్గెట్‌ చేశారని చెప్పుకొచ్చారు. తనపై, తన కుటుంబ సభ్యులపై బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ కత్తిగట్టినట్టు వ్యవహరిస్తూ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలతో భయపడుతున్నందకే మమతా బెనర్జీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.రాజకీయంగానే ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటానని ముకుల్‌ రాయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు