అఖిలేష్.. ఇక చాలు దిగిపో!

12 May, 2017 18:02 IST|Sakshi
అఖిలేష్.. ఇక చాలు దిగిపో!

తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. తన కొడుకు అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను అఖిలేష్ నెరవేర్చలేకపోయారని ములాయం విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ఆయన ఆగ్రాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడని మండిపడ్డారు.

తనకు పదవుల మీద ఆశ లేదని, అయితే అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో జాతీయ మీడియా అతడినే అడగాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటని అడిగితే మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. వాస్తవానికి ములాయం జాతీయాధ్యక్షుడిగా ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని ములాయం అన్నారు.

మరిన్ని వార్తలు