ముంబైకి విమానంలో వెళ్లేవారికి గమనిక

9 Apr, 2018 11:37 IST|Sakshi
చత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు(పాత చిత్రం)

ముంబై: విమానంలో ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి, ఇతర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే వారికి ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య  చత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలు రద్దయ్యాయి. రన్‌వేపై ఉన్న రబ్బర్‌ డిపాజిట్స్‌ను తొలగించడంలో భాగంగా ఈ సమయాల్లో విమానాల అనుమతిని నిలిపేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పూర్తిగా కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

విమానాశ్రయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో పలు విమానయాన సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసి రీషెడ్యూల్‌ చేశాయి. ఈ రెండు తేదీల్లో విమానయాణం చేసే ప్రయాణికులు సమయ మార్పుల గురించి తమ ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్లలో తెలుసుకోవాలని సూచించారు.

చత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు గతంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఇండియా(ఏఏఐ) ఆధీనంలో ఉండేది. 2006 నుంచి పీపీపీ పద్ధతిలో ముంబై ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌, జీవీకే-లెడ్‌ కన్సార్టియం, ఏఏఐలు కలిసి ఎయిర్‌పోర్టును నిర్వహణను చూస్తున్నాయి.

75 ఏళ్ల క్రితం సింగిల్‌ ఇంజిన్‌ కలిగిన ఒకే విమానంతో ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. ప్రస్తుతం 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి 4.52 కోట్ల మంది ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం చేస్తున్నారు. సింగిల్‌ రన్‌వే పై ఒకే రోజు 935 విమానాలు రాకపోకలు సాగించడం చత్రపత్రి శివాజీ ఇంటర్నేషనల్‌ సాధించిన ప్రపంచ రికార్డు.

మరిన్ని వార్తలు