‘హలో నా భార్యను చంపేశా.. రండి’

12 Dec, 2016 15:18 IST|Sakshi
‘హలో నా భార్యను చంపేశా.. రండి’

ముంబయి: వాణిజ్య నగరం ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మొదలైన తగువులాట కత్తిపోట్లకు దారి తీసింది. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆగ్రహానికి లోనైన వైద్యుడైన భర్త ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. దాదాపు మూడుగంటలపాటు ఆమె పక్కనే కూర్చుని అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్యను చంపేసినట్లు చెప్పాడు. ఈ సంఘటన జరిగిన సమయం తమ నాలుగేళ్ల బాలుడు పక్కన గదిలోనే నిద్ర పోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉమేశ్‌ బాబోలే‌(38) అనే వ్యక్తి శివాజీ పార్క్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మతుంగా అనే ప్రాంతంలోని కోహినూర్‌ టవర్స్‌ లో తన భార్య తనూజ (36), కుమారుడితో కలిసి ఉంటున్నాడు. దంతవైద్యుడిగా పనిచేస్తూ జోగేశ్వరి ఈస్ట్‌ వద్ద క్లినిక్‌ నడుపుతున్నాడు. ఓ ఆర్థికపరమైన వ్యవహారం సంబంధించి అతడు భార్య తనూజతో ఆదివారం ఉదయాన్నే 6.30గంటల ప్రాంతంలో గొడవకు దిగాడు. అదికాస్త మరింత పెద్దదై తీవ్ర ఆగ్రహంతో కత్తి తీసుకొని పలుమార్లు ఆమెను పొడిచాడు.

రక్తపు మడుగులో పడి చనిపోయిన ఆమె మృతదేహం పక్కనే మూడుగంటలపాటు కూర్చున్నాడు. 9.30గంటలకు ‘హలో నేను నా భార్యను చంపేశాను.. వచ్చి అరెస్టు చేయండి’ అంటూ పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. అంతకుముందు కూడా వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఎవరితో సరిగా మాట్లాడరని, గత ఏడేళ్లుగా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు