అందరూ మెచ్చుకునే పనిచేసిన మేయర్‌!

28 Apr, 2020 18:31 IST|Sakshi

ముంబాయి: 58 ఏళ్ల వయస్సులో ముంబాయి మేయర్‌ కిషోరీ పెడ్నేకర్‌ 18 సంవత్సరాల తరువాత తిరిగి నర్స్‌ డ్రెస్‌ వేసుకున్నారు. సోమవారం బీవైఎల్‌ నైర్‌ హాస్పటల్‌ని సందర్శించిన కిషోరీ తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారిలో స్ఫూర్తి నింపడానికి తానను మళ్లీ నర్స్‌గా పనిచేయాలనుకుంటున్నట్లు కిషోరీ తెలిపారు. ప్రతి రోజు మూడు గంటల పాటు కరోనా రోగులకు సేవలందిస్తూ  ఆమె విధులు నిర్వర్తించనున్నారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర)

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కరోనాపై పోరాటంలో అందరూ చేతులు కలపాలని పిలుపినిచ్చారు. ఈ నేపథ్యంలోనే నేను మళ్లీ నర్స్‌గా పనిచేసి కరోనా రోగులకు సేవలందించడానికి ముందుకు వచ్చాను. ఇది కొంచెం ప్రమాదంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇలాంటి సమయంలో భయంతో విధుల నుంచి తప్పుకోవడంలో అర్థం లేదు. నాకు చాలా మంది నర్సింగ్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్‌ చేసి తమ పిల్లల్ని కోవిడ్‌-19 విధుల్లో వేయ్యొద్దు అని అడుగుతున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. ఈ వృత్తి అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. ఈ వృత్తిలో ఉన్న వారు హెచ్‌ఐవి, టీబీ లాంటి రోగులకు కూడా సేవలందిస్తారు. అది కూడా ప్రమాదకరమే. కానీ ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు రిస్క్‌ చేయక తప్పదు అని చెప్పాను’ అని కిషోరీపేర్కొన్నారు. 

మూడుసార్లు ముంబాయి మేయర్‌గా గెలిచిన కిషోరీ రాజకీయాల్లోకి రాకముందు 16 సంవత్సరాలు నర్స్‌గా పనిచేశారు. 24 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్రలోని రాయ్‌ఘర్‌లో నర్స్‌గా కేరీర్‌ మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి వెళ్లినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఇలా నర్స్‌గా మారడంతో అందరూ కిషోరీని అభినందిస్తున్నారు.  (మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి)

మరిన్ని వార్తలు