ముంబైకి మరో ముప్పు

22 Jun, 2020 10:30 IST|Sakshi

ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబై మహానగరంపైకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ముంబై దాహార్తిని తీరుస్తున్న ఏడు సరస్సులు, ఆనకటల్లో నీటి నిల్వలు అడుగంటాయి. కేవలం మరో 42 రోజులకు సరిపడే నీళ్లు మాత్రమే వీటిలో మిగిలాయి. జూన్ నెలలో వానలు బాగానే కురిసినా సరస్సుల్లోకి చేరిన నీరు మాత్రమే అంతతమాత్రమే.

ఎగువ వైతర్ణ, మధ్య వైతర్ణ, మోదక్ సాగర్, తన్సా, భట్సా, విహార్, తులసి సరస్సులకు దాదాపు 14.47 లక్షల లీటర్ల తాగు నీటిని నిల్వ చేయగల సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం వీటిలో 1.57 లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తాగునీటి నిల్వలపై నగరవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తెలిపారు. ముందుముందు వానలు బాగా కురుస్తాయనే సమాచారం తమకు ఉందని చెప్పారు.(కోవిడ్‌ ఔషధం: ఒక్కో ట్యాబ్లెట్‌ రూ.103)

గతేడాది ఇదే సమయానికి ఈ ఏడు సరస్సుల్లో 82,829 లీటర్ల నీరు మాత్రమే ఉంది. 2018లో ఇంతకంటే దారుణంగా నీటి నిల్వలు తగ్గిపోయాయి. దాంతో పంపిణీ చేసే నీటిలో పది శాతం కోత విధించారు. ఈ ఏడాది నీటి పంపిణీలో కోత ఉండకపోవచ్చని బీఎంసీ అధికారులు వెల్లడించారు. (24 గంటల్లో 14,821 కొత్త కేసులు)

ముంబై దాహార్తిని తీర్చడానికి రోజుకు 420 కోట్ల లీటర్లు అవసరం కాగా, 375 కోట్ల లీటర్లను మాత్రమే బీఎంసీ పంపిణీ చేయగలుగుతోంది. ‘ఈ ఏడాది ముంబైలో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ సంస్థ వెల్లడించింది. ఎగువ వైతర్ణ, మధ్య వైతర్ణ తదితర డ్యాముల్లో నీటి నిల్వలు గతేడాది పోల్చితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి తాగునీటి అందుబాటుపై ఎలాంటి బెంగ అవసరం లేదు’ అని బీఎంసీ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పీ వేల్ రసు తెలిపారు.

మరిన్ని వార్తలు