పట్నా : ఎవరైనా తప్పు చేస్తే సాధారణంగా పశ్చాత్తాపం కోసం శిక్షను అమలు చేస్తారు. కనీసం అక్కడైనా తన ప్రవర్తనలో మార్పు కలుగుతుందని అధికారులు ఇలా చేస్తారు. అయితే బిహార్ జైలులో జరిగిన ఓ సంఘటన మాత్రం దీనికి అతీతం. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ నేరస్తుడు తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. అంతేగాక పార్టీ కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేసి తోటి ఖైదీలకు మటన్ బిర్యానీతో విందు భోజనాన్ని అందించాడు. జైల్లో ఓ ఖైదీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నరంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
బిహార్లో ఇద్దరు ఇంజనీర్లను హత్య చేసిన కేసులో పింటు అనే ఖైదీ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇటీవల అతని పుట్టినరోజు రావడంతో జైలులోనే ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్చేసి, స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం మటన్తో భోజనం చేశారు. అయితే దీన్ని తోటి నేరస్తులంతా ప్రోత్సహిస్తూ అక్కడ జరిగిన తతంగాన్నంతా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్తా జైలు అధికారి దాకా వెళ్లడంతో ఘటనపై ఐజీ విచారణకు ఆదేశించారు. అసలు జైలులోకి మొబైల్ ఫోన్ ఎలా వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో జైలు నుంచి ఓ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన విషయం తెలిసిందే.