రక్తదానం కోసం.. రంజాన్‌ దీక్షను పక్కనబెట్టాడు

23 May, 2018 23:39 IST|Sakshi

చిన్నారి ప్రాణాలు కాపాడిన జావెద్‌

సాక్షి, పట్నా: మతం కంటే మానవత్వం గొప్పదని మరోసారి రుజువైంది. బాలుడి ప్రాణాలు  కాపాడేందుకు తాను చేస్తోన్న ఉపవాస దీక్షను పక్కనబెట్టాడు ఓ మహమ్మదీయుడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లా సదార్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు రాజేశ్‌కుమార్‌ అనే ఎనిమిదేళ్ల పిల్లాడిని తీసుకువచ్చాడు అతని తండ్రి. తలసేమియా వ్యాధి కారణంగా బాలుడికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పడంతో ఆ తండ్రి ప్రతీ బ్లండ్‌ బ్యాంకును సంప్రదించాడు. అయినా ఫలితం లేకపోయింది.

ప్రాణాలతో పోరాడుతున్న రాజేశ్‌ దీనగాథ విని జావెద్‌ ఆలం అనే వ్యక్తి రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అప్పటికే జావెద్‌ రంజాన్‌ దీక్షలో ఉన్నాడు. సాధారణంగా రంజాన్‌ ఉపవాసంలో ఉన్నవారు ఆ రోజు దీక్ష ముగిసేదాకా మంచినీళ్లయినా ముట్టరు. కానీ, రక్తదానం తరువాత జావెద్‌ పళ్లరసాలు, కొన్ని పండ్లను తీసుకున్నాడు. బాబు ప్రాణాలు కాపాడేందుకు దీక్ష భగ్నం చేశాడని తెలిసి.. స్నేహితులు జావెద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తలసేమియా వ్యాధి ఉన్న వారికి మూడు, నాలుగు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి  ఉంటుంది. 

మరిన్ని వార్తలు