మూక దాడుల భయంతో ఆ అధికారి ఏం చేశాడంటే..

7 Jul, 2019 16:23 IST|Sakshi

భోపాల్‌ : దేశంలో అల్లరి మూకలు మూక దాడులతో చెలరేగుతున్న ఘటనలతో వీటి బారిన పడకుండా తన పేరును మార్చుకోవాలని భావిస్తున్నానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం అధికారి పేర్కొన్నారు. దేశంలో ముస్లింల భద్రత పట్ల భయాందోళనలు నెలకొన్నాయని సీనియర్‌ అధికారి నియాజ్‌ ఖాన్‌ వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. తన ముస్లిం గుర్తింపును దాచేందుకు తన పేరును మార్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

అల్లరి మూకల దాడుల నుంచి తనను కొత్త పేరు కాపాడుతుందని చెప్పారు. తాను కుర్తా వేసుకోనని, గడ్డం పెంచుకోనని తన వేషధారణ కారణంగా తాను విద్వేష మూకల హింస నుంచి సులభంగా తప్పించుకోగలుగుతానని ఆ అధికారి పేర్కొనడం గమనార్హం. తన సోదరుడు సంప్రదాయ దుస్తులు ధరించి, గడ్డం పెంచుకోవడంతో అతనికి ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. అల్లరి మూకల నుంచి ఏ వ్యవస్థ ముస్లింలను కాపాడలేదని, అందుకే వారు తమ పేర్లను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ముస్లిం నటులు సైతం వారి సినిమాలను కాపాడుకోవాలంటే పేర్లు మార్చుకోవాలని సూచించారు. టాప్‌ స్టార్ల సినిమాలు సైతం మంచి బిజినెస్‌ చేయడం లేదని, దీనికి కారణం వారు గుర్తించాలని కోరారు. నవలలు కూడా రాసే ఈ అధికారి తన నూతన నవలలో తన ఆందోళనలకు అక్షరం రూపం ఇచ్చానని చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు