93 ప్రాజెక్టులకు 65 వేల కోట్ల రుణం

17 Sep, 2018 04:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న 93 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు 65,634.93 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు చైర్మన్‌ హర్షకుమార్‌ భన్వాలా వెల్లడించారు. పీఎంకేఎస్‌వై కింద మొత్తం 99 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నాబార్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున నిధులు సమకూరుస్తోంది.

ఈ 99 ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 70 వేల కోట్ల రూపాయలను నాబార్డు అందించాల్సి ఉంది. భన్వాలా మాట్లాడుతూ 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 23,402.72 కోట్లను ఇప్పటికే ఇచ్చేశామనీ, 18 ప్రాజెక్టులు పూర్తవ్వగా మరో ఏడు ప్రాజెక్టుల నిర్మాణం తుదిదశలో ఉందని చెప్పారు. పీఎంకేఎస్‌వై కింద చేపడుతున్న ఈ 99 ప్రాజెక్టుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణల్లోనూ పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు