మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : ప్రధాని మోదీ

24 Feb, 2020 14:33 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుపొందిన మొతెరా క్రికెట్‌ స్టేడియం ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తింది. లక్షా 20 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న స్టేడియం జనంతో కిక్కిరిపోయింది.   సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను సభకు పరిచయం చేసిన అనంతరం ప్రధాని మోదీ ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభికులతో సమస్తే ట్రంప్‌ అంటూ పలికించారు. అమెరికా, భారత్‌ జాతీయా గీతాలాపన అనంతరం ‘భారత్‌ మాతాకీ జై’  అంటూ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించారు. నమస్తే ట్రంప్‌ అంటూ సభికులను పలకరించారు. భారత్‌-అమెరికా స్నేహం పరిఢవిల్లాలని నినదించారు. ఆయన మాట్లాడుతూ...
(చదవండి : ట్రంప్‌ టూర్‌ : వావ్‌ తాజ్‌ అంటారా..?)

‘మొతెరా క్రికెట్‌ స్టేడియంలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్‌ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ట్రంప్‌, ఆయన కుటుంబం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఇది గుజరాతీ గడ్డ అయినా యావత్తు దేశమంతా దీన్ని స్వాగతిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి ఇదే నిదర్శనం. ట్రంప్‌ ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, అమెరికా యావత్తు భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది.
(చదవండి :ఆ హోటల్లో ట్రంప్‌ విడిది.. ఒక రాత్రి ఖర్చు..)

అహ్మదాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ నదికి విశిష్టపాత్ర ఉంది. మనం అనుసరిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం.. భారత్‌ అమెరికాలను కలుపుతుంది. స్టాచ్యు ఆఫ్‌ లిబర్టీ - స్టాచ్యూ ఆఫ్‌ పటేల్‌ మధ్య సంబంధముంది. ఇరు దేశాల స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడాలి. ట్రంప్‌ రాక దీనికి కచ్చితంగా దోహదపడుతుది. అభివృద్ధి, సౌభ్రాతృత్వానికి బాటలు వేస్తుంది. అమెరికాలో సమాజాభివృద్ధికి మెలానియా కృషిని ప్రశంసిస్తున్నాం. బాలల సంక్షేమానికి మెలానియా చేసిన కృషి అభినందనీయం. ఇవాంక రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చారు. మరోసారి ఇవాంకకు స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నా’అని మోదీ పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు