'కరోనాపై సైనికుల్లా యుద్దం చేస్తున్నారు'

26 Apr, 2020 12:29 IST|Sakshi

ఢిల్లీ : క‌రోనా వైర‌స్‌పై భార‌త్‌లో ప్రజా పోరాటం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై పోరాటం సరైన దిశలోనే సాగుతుందన్నారు. దేశ ప్రజలంతా ఒకరికొకరు అండగా నిలబడ్డారని, ఈ పోరాటానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రతీ పౌరుడు ఒక సైనికుడిలా కరోనా వైర‌స్‌ ఫై యుద్ధం చేస్తున్నార‌న్నారు. క‌రోనా సంక్షోభ వేళ రైతులునిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌న్నారు. ఎవ‌రు కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు వారు తమ శాయాశక్తుల శ్రమిస్తున్నట్లు తెలిపారు. (వావ్‌! వాట్ యాన్ ఐడియా 'ప్రేమ్‌జీ')

ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిందని తెలిపారు. మాస్క్‌లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని, నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయ‌న్నారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారని వారికి తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. బ‌హిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్రజల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ అన్నారు. ఇలాంటి అల‌వాటును ఆపాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. కరోనా నివారణను అరిక‌ట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. 

మరిన్ని వార్తలు