ఘనంగా గణతంత్రం.. ప్రధాని మోదీ నివాళి

26 Jan, 2020 10:10 IST|Sakshi

దేశ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌లో  అమర జవాన్లకు నివాళి అర్పించారు. దేశ రక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సైనికులు చేసిన గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు.

దేశ 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సైనిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన బ్రెజిల్‌ అధ్యక్షుడు జయిర్‌ బొల్సనారోతో కలిసి ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవందనాన్ని వారు స్వీకరించారు. ఈ వేడుకల్లో సైనికులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. 

దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన జెండాను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంచుకొండల్లో ప్రత్యేక విన్యాసాలు చేశారు. యుద్ధరంగంలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు.
 

మరిన్ని వార్తలు