ఆ క్షణాలు మరచిపోలేనివి..

26 Jul, 2019 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ : కార్గిల్‌ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీటర్‌లో తన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. కార్గిల్‌ యుద్ద సమయంలో వీరోచితంగా పోరాడిన భారత మాత ముద్దు బిడ్డలకు ఆయన వందనాలు సమర్పించారు. ఈ రోజు మన సైనికులు ధైర్య, సాహసాలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. మాతృ భూమిని కాపాడుకోవడం సర్వస్వం అర్పించిన అమరవీరులకు వినయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా కార్గిల్‌ గొప్ప తనాన్ని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.

ఆ క్షణాలు మరచిపోలేనివి..
కార్గిల్‌ యుద్ధ సమయంలో సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ యుద్దం జరుగుతున్న సమయంలో తాను జమ్మూ కశ్మీర్‌తోపాటు, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ (బీజేపీ) కోసం పనిచేస్తున్నట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనకు కార్గిల్‌ వెళ్లి.. మన వీర సైనికులను కలిసే అవకాశం వచ్చిందని తెలిపారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా, సరిగా ఇరవై ఏళ్ల క్రితం భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముష్కరులకు భారత సైనికులు నిలువరించారు. సాహసోపేతంగా పోరాడి ముష్కరులు తోకముడిచేలా చేశారు. 1999  జూలై 26న ఈ యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు