నిర్భయ దోషులకు ఉరి అమలుపై మోదీ

20 Mar, 2020 12:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడాలన్న దేశ వ్యాప్త డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. శుక్రవారం ఉదయం 5గంటల 30 నిమిషాలను నలుగురు దోషులను తీహార్‌ జైలు అధికారులు ఉరి తీశారు. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.  ‘చివరికి న్యాయమే గెలిచింది. మన నారీమణులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి భద్రతతో పాటు మరింత గౌరవాన్ని పెంచాల్సిన అవసరముంది. అన్ని రంగాల్లో సమానత్వం, అవకాశాల కల్పన ఎంతో ముఖ్యం. మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలి. దీనికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి అమలుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఆలస్యం అయినప్పటికీ దోషులకు శిక్షం పడటం సంతోషకరమన్నారు. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్నారు.

మరిన్ని వార్తలు