సుమిత్రా మహాజన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోదీ

13 May, 2019 09:49 IST|Sakshi

భోపాల్‌ : లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన రెండో మహిళ సుమిత్రా మహాజన్‌. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేకుండా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన మహాజన్‌.. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. పదవిలో ఉండగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఇండోర్‌ ప్రజల అభిమానాన్ని గెల్చుకున్నారు సుమిత్రా మహాజన్‌. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలు ఆమెను ‘తాయి’ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఈ క్రమంలో ఆదివారం ఇండోర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సుమిత్రా మహజన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంభంధించి ఏ విషయంలోనైనా సరే మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి అని మోదీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ స్పీకర్‌గా తాయి తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ప్రజల మనసులో ఆమె పట్ల చాలా మంచి అభిప్రాయం ఉంది. మీ అందరికి నేను ఈ దేశ ప్రధానిగానే తెలుసు. ఇప్పుడు నేను చెప్పేబోయే విషయం నా పార్టీలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏ విషయంలోనైనా సరే నన్ను మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి మాత్రమే’ అని చెప్పారు. అంతేకాక మేమిద్దరం బీజేపీ కోసం కలసి పని చేశాం. పని పట్ల ఆమెకు చాలా శ్రద్ధ. ఇండోర్‌ అభివృద్ధి విషయంలో తాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు అని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు